Taliban-India: భారత్‌ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం!

5 Sep, 2021 02:53 IST|Sakshi
విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా

అఫ్గాన్‌ గడ్డను ఉగ్ర అడ్డాగా మార్చవద్దని స్పష్టం చేశాం

భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా

వాషింగ్టన్‌: అఫ్గాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. తాలిబన్ల అ«దీనంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌లో పాక్‌ చర్యల్ని భారత్, అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.అఫ్గాన్‌లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని శ్రింగ్లా తెలిపారు. 
(చదవండి: Kodanad Case: వీడని మిస్టరీ.. అంతులేని ‘కొడనాడు’ కథ)

అఫ్గాన్‌పై అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని, భారత్‌ సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. వేగంగా మారుతున్న పరిణామాలు ఎలా రూపుదిద్దుకుంటాయో గమనిస్తున్నామన్నారు.తాలిబన్లతో భారత్‌ సంబంధాలు పరిమితమని, ఇటీవలి భేటీలో ఏ విషయంపైనా విస్తృత స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. అయితే, అఫ్గాన్‌ గడ్డను ఉగ్ర అడ్డాగా మారుతుందేమోనన్న భారత ఆందోళనపై సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని తెలిపారు.   అఫ్గాన్‌ భూభాగంలోని అనేక శక్తులకు పాక్‌ అండగా నిలిచిందని చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు అఫ్గాన్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని,  వీరి కదలికలపై కన్నేసి ఉంచామని తెలిపారు. అఫ్గాన్‌ నుంచి ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు సాగినా తాలిబన్లదే బాధ్యతన్నారు.

నవంబర్‌లో అమెరికాతో చర్చలు
భారత్, అమెరికా మధ్య నాలుగో వార్షిక 2+2 చర్చలు నవంబర్‌లో వాషింగ్టన్‌లో జరుగుతాయని హర్షవర్ధన్‌ చెప్పారు. ఈదఫా చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాధ్‌ సింగ్, జైశంకర్‌లు తొలిసారి బైడెన్‌ ప్రభుత్వంలోని రక్షణ, విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు.
(చదవండి: బీజేపీ నేత సువేందుకు సమన్లు)

మరిన్ని వార్తలు