హాంకాంగ్‌లో లాక్‌డౌన్‌..48 గంటల్లోగా టెస్టింగ్‌

23 Jan, 2021 17:30 IST|Sakshi

హాంకాంగ్ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాంకాంగ్‌లోని కోలూన్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించింది. అక్కడ నివసించే 10వేలమంది నివాసితులు తప్పనిసరిగా కోవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని, అప్పటివరకు వారంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం (ఐసీసీ)కి దగ్గరగా ఉన్న ఈ నిషేధిత ప్రాంతంలో గత కొన్నిరోజులుగా జోర్దాన్‌ నుంచి అనేకమంది వచ్చారు. దీంతో వీరి వల్లే వైరస్‌ వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో 70కి పైగా నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 48 గంటల్లోగా టెస్టింగ్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. (మోడల్‌ క్రేజ్‌.. ఫాలో అవుతోన్న బైడెన్)

ఈ ప్రాంతంలో వృద్దాప్య జనాభా ఎక్కువగా ఉన్నందున కోవిడ్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో సాధ్యమైనంత త్వరగా టెస్టింగ్‌ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే 50 టెస్టింగ్‌ పాయింట్లను ఏర్పటు చేశారు. ఇప్పటికే ఈనెలలో 162కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిమ్‌, క్రీడా ప్రాంగణాలు, సెలూన్లు, సినిమా హాళ్లపై విధించిన నిషేధాన్ని జనవరి 27వరకు ప్రభుత్వం పొడిగించింది. గత 24 గంటల్లోనే హాంకాంగ్‌లో 81 కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,010కి చేరగా, ఇప్పటివరకు 160మంది కోవిడ్‌కు బలయ్యారు. (భారత్‌ను హనుమాన్‌తో పోల్చిన బ్రెజిల్‌ అధ్యక్షుడు)

>
మరిన్ని వార్తలు