ఎలుగుబంటి బోనులోకి బిడ్డను విసిరేసిన తల్లి!! ఆపై ఏం జరిగిందో చూడండి..

3 Feb, 2022 12:37 IST|Sakshi

కన్నపేగు మమకారం మరిచిన ఆ తల్లి.. కర్కకశంగా వ్యవహరించింది. మూడేళ్ల బిడ్డను నిర్దాక్షిణ్యంగా ఎలుగుబంటి బోనులోకి విసిరేసింది. పదహారు అడుగుల లోపలికి పడిపోయిన ఆ బిడ్డ తలకు గాయమై.. స్పృహ కోల్పోయింది. అందరూ అరుస్తుండగా.. ఆ బిడ్డ వైపు వెళ్లింది ఓ ఎలుగుబంటి. మరి ఆపై ఏం జరిగిందంటే..  

కన్నబిడ్డను చేజేతులారా చంపాలని ప్రయత్నించింది ఓ తల్లి. తాష్కెంట్‌ జూలో ఎలుగు బంటి ఎన్‌క్లోజర్‌ దగ్గరికి వెళ్లి.. తన బిడ్డను అందులోకి విసిరేసింది. అప్పటికే ఆమె చేష్టలు అనుమానంగా ఉండడంతో పక్కనే ఉన్న సందర్శకులు, జూ సిబ్బంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. కానీ, హఠాత్తుగా ఆమె ఆ చిన్నారిని విసిరేసింది. 

ఆ ఎన్‌క్లోజర్‌ పదహారు అడుగుల లోతు ఉండడంతో.. కింద పడ్డ బిడ్డ తలకు గాయమైంది. ఇంతలో జూజూ అనే ఎలుగుబంటి ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి వాసన చూసింది. కానీ, అదృష్టవశాత్తూ ఏం చేయకుండా దూరంగా వెళ్లిపోయింది. ఇంతలో ఆరుగురు జూ సిబ్బంది ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. ఆ ఎలుగు బంటిని మళ్లీ బిడ్డ దగ్గరికి వెళ్లనీయకుండా.. దారి మళ్లించారు. ఆపై బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.

ఆ వెంటనే ఆమెను అరెస్ట్‌ చేయగా..  బిడ్డ ప్రాణం తీసేంత కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. హత్యాయత్నం కింద నేరం రుజువైతే ఆమెకు పదిహేనేళ్ల శిక్ష పడుతుంది. తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉంది.

మరిన్ని వార్తలు