భార్య మాట వినటమే అదృష్టంగా మారింది.. భర్తకు రూ.1.5 కోట్ల జాక్‌పాట్‌

1 Oct, 2022 20:40 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇంట్లో సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురండి అనీ భార్య ఫోన్‌ చేస్తే చాలా మంది భర్తలు విసుక్కుంటారు. నువ్వే వెళ్లి తెచ్చుకో.. నాకు ఓపిక లేదని తెగేసి చెబుతుంటారు. కానీ, భార్య మాట విని చెప్పిన పని చేసిన ఓ భర్త జీవితమే మారిపోయింది. లాటరీలో ఏకంగా రూ.1.5 కోట్ల జాక్‌పాట్‌ తగిలింది. ఈ సంఘటన అమెరికాలోని మిచిగన్‌ రాష్ట్రంలో జరిగింది. 

మిచిగన్‌ రాష్ట్రంలోని మార్క్వేట్‌ ప్రాంతానికి చెందిన ప్రిస్టోన్‌ మాకీ(46) అనే వ్యక్తికి ‘మిచిగన్‌ లాటరీ’లో 190,736డాలర్లు(రూ.1.5కోట్లు) గెలుచుకున్నాడు. అయితే, ఆ లాటరీలో డబ్బులు వచ్చేందుకు తన భార్య పంపిన మెసేజ్‌ కారణమని చెబుతున్నాడు ప్రిస్టోన్‌ మాకీ. ‘నేను నా విధులు ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు కిరాణ సరుకులు తీసుకురావాలని నా భార్య మెసేజ్‌ చేసింది. దీంతో వచ్చే దారిలో సరుకులు కొనేందుకు షాప్‌కి వెళ్లాను, అక్కడే 5 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాను. ఆ తర్వాతి రోజు ఉదయం, కిచెన్‌లో ఉన్న సమయంలో లాటరీ టికెట్లను మొబైల్‌ యాప్‌లో స్కాన్‌ చేశాను. నేనే జాక్‌పాట్‌ విన్నర్‌గా తెలుసుకున్నాను. అది ఊహించని పరిణామంగా అనిపించింది. ’ అని తెలిపారు ప్రిస్టోన్‌ మాకీ. 

లాటరీలో లభించే రూ.1.5 కోట్ల నగదులో కొంత తన పెట్టుబడుల కోసం ఉంచుకుని, మిగిలినది కుటుంబ సభ్యులకు పంచిస్తానని చెప్పారు ప్రిస్టోన్‌ మాకీ. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సైతం ఈ విధంగానే రూ.15 కోట్ల జాక్‌పాట్‌ కొట్టినట్లు చెప్పాడు. తాను కిరాణ సరుకుల కోసం వెళ్లి టికెట్‌ కొనుగోలు చేయటం ద్వారానే లాటరీలో విజేతగా నిలిచానని తెలిపాడు.

ఇదీ చదవండి: ఢిల్లీ నుంచే యూరప్‌లో ప్రధాని మోదీ కారు డ్రైవింగ్‌.. 5జీ సాయంతో..

మరిన్ని వార్తలు