కశ్మీర్‌ సమస్య పరిష్కారమైతే... అణ్వాయుధాలే అవసరం లేదు

22 Jun, 2021 02:21 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం తమను తాము రక్షించుకోవడానికే అని, కశ్మీర్‌ అంశం పరిష్కారమైతే అణ్వాయుధాల అవసరం ఉండబోదని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నాటికి పాకిస్తాన్‌ వద్ద 165 అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) ఇటీవల తెలిపింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ ఓ న్యూస్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

పాక్‌ అణ్వాయుధాల సంఖ్య పెరుగుతోందా? అడి అడగ్గా... ఆ విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. పక్క దేశం తమకంటే ఏడు రెట్లు పెద్దదైనప్పుడు చిన్న దేశం తప్పకుండా జాగ్రత్తపడుతుందని ఇమ్రాన్‌ అన్నారు. అందులో తప్పేమీ లేదన్నారు. అయితే తాను మాత్రం అణ్వాయుధాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. కశ్మీర్‌ అంశాన్ని పరిష్కరించడంలో అమెరికాకు బాధ్యత ఉందని అన్నారు. వారు తలచుకుంటే దాన్ని పరిష్కరించగలరని కూడా చెప్పారు. అయితే సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ అంశంపై మూడో దేశం మధ్యవర్తిత్వం ఉండరాదని భారత్‌ చెబుతోంది. 

మరిన్ని వార్తలు