-

అంతకన్నా పాక్‌ మీద అణుబాంబులు వేయండి: ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర వ్యాఖ్యలు

14 May, 2022 21:17 IST|Sakshi

ఇస్లామాబాద్‌:  పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను దొంగల చేతిలో పెట్టడం కంటే.. అణు బాంబులు వేసి పాకిస్థాన్‌ను నాశనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. 

శుక్రవారం బనిగల నివాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షెహ్‌బాజ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. దొంగలు పాక్‌ను పాలించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, అంతకంటే దేశాన్ని ఒక అణు బాంబు వేసి పాక్‌ను నాశనం చేయడం ఉత్తమం అని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చిన కొందరు.. గతంలో ప్రతీ వ్యవస్థను నాశనం చేసి అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు వాళ్లను ఎవరు విచారిస్తారని అన్నారు. ఇతరులపై ఆరోపణలు చేయడం మాని.. ముందు ప్రభుత్వ పని తీరును చక్కబర్చాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి హితవు పలికారు. పాక్‌ నిజమైన స్వాతంత్ర్యం కోసం ఈ నెల 20వ తేదీన 20 లక్షల మందితో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించారాయన. దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ప్రజల్లో తన ప్రసంగాల ద్వారా విషం నింపుతున్నారంటూ ప్రధాని షెహబాజ్‌, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ పై మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు