Imran Khan: అరెస్టుతో నా పరువు పోయింది! 1,500 కోట్ల పరిహారం కోరుతూ NABకి లీగల్‌ నోటీసులు

3 Jun, 2023 08:26 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాక్‌ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ భారీ పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకు ఈ మేరకు నోటీసులు సైతం పంపించారు. గత నెల జరిగిన తన అరెస్ట్ వల్ల తన ప్రతిష్ఠ తీవ్ర భంగం వాటిల్లిందని, అందుకుగానూ 1,500 కోట్ల రూపాయలు(పాకిస్తానీ రూపీ) చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారాయన. 

తన అరెస్ట్ వారెంట్ ప్రభుత్వ సెలవు రోజున జారీ అయిందని, దానిని ఎనిమిది రోజుల పాటు రహస్యంగా ఉంచారని, ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో విచారణను మార్చుతున్నట్లుగా తనకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. తనను అరెస్ట్ చేయడానికి పాకిస్థాన్ రేంజర్లను ఉపయోగించారని తెలిపారు. అరెస్ట్ వారెంట్ అమలు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు పేర్కొన్నదని గుర్తు చేశారు. ఎన్ఏబీ చైర్మన్‌కు నోటీసులు పంపించారాయన. 

ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో నా అరెస్ట్ నా ప్రతిష్ఠకు భంగం కలిగించడమే. నేను అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యానని ప్రపంచానికి చూపించాలనుకున్నారు.  ప్రతీ ఏడాది నా చారిటీ కోసం పది బిలియన్ల పాకిస్థానీ రూపాయల్ని విరాళంగా అందుకుంటున్నా. కానీ, ఏనాడూ నా నిజాయతీపై ఎప్పుడూ ప్రశ్న ఎదురు కాలేదు. అయితే ఈ మధ్య జరిగిన నా అరెస్ట్‌.. బోగస్‌. దాని వల్ల నా ప్రతిష్ఠకు భంగం వాటిల్లింది.  నా హక్కుల్లో భాగంగా పరువు నష్టం దావా ప్రక్రియను ప్రారంభించా అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. 

మరిన్ని వార్తలు