అందరినీ అన్‌ఫాలో చేసిన ప్రధాని!

8 Dec, 2020 16:00 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అధికారిక ట్విటర్‌ ఖాతా నుంచి తన మొదటి భార్యతో సహా అందరిని అన్‌ఫాలో చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు ఆయనను ట్రోల్‌ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఇమ్రాన్‌ అనుసరిస్తున్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘‘ఇమ్రాన్‌ నవాజ్‌ షరీఫ్‌ టైమ్‌లైన్‌ చూశారు. ఆయన ఎవరినీ ఫాలో అవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించారు. దాంతో ఆయనకు కోపం వచ్చింది. తానేమీ తక్కువ కాదు కదా అనుకుని ఉంటారు. అందుకే వెంటనే తన టైమ్‌లైన్‌కు వెళ్లి మాజీ భార్య సహా అందరినీ అన్‌ఫాలో చేసి పడేశారు’’అంటూ జోక్స్‌ పేలుస్తున్నారు. (చదవండి: యాచకురాలు అయింది చట్టభద్రురాలు)

ఇక మరికొంత మంది మాత్రం ఇమ్రాన్‌ ఖాన్‌ తన మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్‌ను అన్‌ఫాలో చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. విడిపోయిన తర్వాత కూడా ట్విటర్‌ వేదికగా ఒకరినొకరు పలకరించుకునే మీరు ఇలా దూరంగా ఉండటం జీర్ణించుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం కచ్చితంగా జెమీమా హృదయాన్ని ముక్కలు చేసి ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. కాగా 2010లో ట్విటర్‌ ఖాతా తెరిచిన ఇమ్రాన్‌ ఖాన్‌... ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తారు. ఇక ఇమ్రాన్‌ వ్యక్తిగత విషయానికొస్తే.. తొలుత బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను ఇమ్రాన్‌ పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకుని‌.. మరో జర్నలిస్టు రేహమ్‌ను(2015)లో రెండో పెళ్లి చేసుకున్నారు. 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా ముగిసిపోయింది. ఆ తర్వాత మత గురువైన బుష్రాను ఆయన మూడో పెళ్లి చేసుకున్నారు.


 

మరిన్ని వార్తలు