ఫేస్‌బుక్‌ సీఈఓకు ఇమ్రాన్‌ ఖాన్‌ లేఖ

26 Oct, 2020 17:19 IST|Sakshi

‘ఇస్లాంను ఉగ్రవాదంతో ముడిపెడుతున్నారు’ 

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌ సీఈఓకు సోమవారం లేఖ రాశారు. సోషల్‌ మీడియా వేదికపై ఇస్లాం వ్యతిరేక కంటెంట్‌ను నిషేధించాలని కోరారు. ఇస్లాంపై దాడిచేస్తున్నారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడిపై మండిపడిన కొద్దిసేపటికే ఫేస్‌బుక్‌ సీఈఓకు ఇమ్రాన్‌ లేఖ రాశారు.

ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఇస్లామోఫోబియా పెరిగిపోతుండటం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను ప్రేరేపిస్తోందని సోషల్‌ మీడియా దిగ్గజానికి రాసిన బహిరంగ లేఖను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్‌ వేదికగా ఇస్లామోఫోబియో, ఇస్లాంపై విద్వేష కంటెంట్‌ను నిషేధించాలని ఆయన కోరారు. చదవండి : ఇమ్రాన్‌కు భంగపాటు

తన లేఖలో ఫ్రాన్స్‌లో పరిస్థితిని కూడా ఇమ్రాన్‌ ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో ఇస్లాంను ఉగ్రవాదంతో ముడిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరికి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ విద్వేష సందేశాలను పంపడం ఆమోదయోగ్యం కాదని పక్షపాతంతో కూడిన ఇలాంటి ఘటనలు హింసాప్రవృత్తిని మరింత పెంచుతాయని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్‌ లేఖపై ఫేస్‌బుక్‌ ప్రతినిధి స్పందిస్తూ ఏ రూపంలోనైనా విద్వేషాన్ని తాము వ్యతిరేకిస్తామని, మతం, వర్ణం, జాతి ప్రాతిపదికన దాడులను అనుమతించమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు