‘ఉక్రెయిన్‌ నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోండి’.. భారత పౌరులకు హెచ్చరిక

20 Oct, 2022 12:25 IST|Sakshi

కీవ్‌: రష్యాలోని కీలకమైన కెర్చ్‌ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి మాస్కో సేనలు. ఇరాన్‌  ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారడం వల్ల కీవ్‌లోని ఇండియన్‌ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఇంకా ఎవరైనా భారత పౌరులు ఉంటే వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.  

‘ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు మరింద దిగజారుతున్నాయి. పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులు ఎవరైనా ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉండి ఉంటే వీలైనంత త్వరగా అందుబాటులోని మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’ అని భారత రాయబార కార్యాలయం బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. 

ఉక్రెయిన్‌లోని నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్‌లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది.

ఇదీ చదవండి: బ్రిటన్‌లో తీవ్రమైన సంక్షోభం.. తిండికి దూరంగా లక్షల మంది!

మరిన్ని వార్తలు