తెలంగాణ స్టార్టప్‌కు ఎకో ఆస్కార్‌

4 Dec, 2022 06:24 IST|Sakshi

ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ అందుకున్న ‘ఖేతి’

లండన్‌: పర్యావరణ ఆస్కార్‌గా పేరొందిన ప్రతిష్టాత్మక ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ తెలంగాణలో ఏర్పాటైన అంకుర సంస్థ ‘ఖేతి’కి దక్కింది. పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటూ సన్నకారు రైతుల సాగు ఖర్చును తగ్గించి, దిగుబడి, ఆదాయం పెంచుకునేందుకు ఈ సంస్థ సాయమందిస్తోంది. అందుకు గాను ‘ప్రొటెక్ట్, రీస్టోర్‌ నేచర్‌’ విభాగంగా ఈ అవార్డును అందుకుంది. పురస్కారంతో పాటు పది లక్షల పౌండ్ల బహుమతి సొంతం చేసుకుంది. ఖేతి అనుసరిస్తున్న ‘గ్రీన్‌హౌజ్‌ ఇన్‌ ఏ బాక్స్‌’ విధానానికి ఈ అవార్డ్‌ను ఇస్తున్నట్లు ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ వ్యవస్థాపకుడు, బ్రిటన్‌ యువరాజు విలియం వ్యాఖ్యానించారు.

శుక్రవారం రాత్రి అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో ఖేతి సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కప్పగంతుల కౌశిక్‌ పురస్కారం అందుకున్నారు. ‘‘మా పద్ధతిలో రసాయ నాల వాడకమూ అతి తక్కువగా ఉంటుంది. పంటకు నీటి అవసరం ఏకంగా 98% తగ్గుతుంది! దిగుబడి ఏకంగా ఏడు రెట్లు అధికంగా వస్తుంది. ‘గ్రీన్‌హౌజ్‌’ కంటే ఇందులో ఖర్చు 90 శాతం తక్కువ. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. మళ్లీ పంట సాగుకు, పిల్లల చదువు తదితరాలకు వాడుకోవచ్చు.’’ అని ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు