లంకకు భారత్‌ ఆపన్నహస్తం

3 Apr, 2022 06:10 IST|Sakshi

40 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ సరఫరా

కొలంబో: ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్‌ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్‌ అందించిన నాలుగో డీజిల్‌ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది.

36 గంటల కర్ఫ్యూ
ఆహార కొరత, ధరల మంటను భరించలేక శ్రీలంకలో జనం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శనివారం సాయంత్రం ఆరింటి వరకు దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధించారు. ఆదివారం జరగనున్న దేశవ్యాప్త నిరసనలను అడ్డుకోవడమే దీని ఉద్దేశంగా కన్పిస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి దేశంలో ఎమర్జెన్సీ విధించడం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

అన్ని పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి
ఆర్థిక సంక్షోభం ముగిసి పరిస్థితి చక్కబడాలంటే అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు గొటబయా రాజపక్సకు ఫ్రీడం పార్టీ విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించకపోతే అధికార కూటమి నుంచి తప్పుకుంటామని తేల్చిచెప్పింది.
 

మరిన్ని వార్తలు