ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ఆందోళన

25 Sep, 2020 17:15 IST|Sakshi

జెనీవా/న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, వీడియోల ద్వారా ఉగ్రవాదులు సోషల్‌ మీడియాలో​ దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 45వ సమావేశాల్లో భారత్‌ పేర్కొంది. ఇంటర్‌నెట్‌, సోషల్‌ మీడియాలో నకిలీ కంటెంట్‌ పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితిలో భారత్‌ శాశ్వత మిషన్‌ కార్యదర్శి పవన్‌ బాధే ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలు, యువతను తమ శ్రేణుల్లో నియమించుకునే ఉద్దేశంతో ఈ ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. భద్రతా దళాలు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు ఉగ్రవాదులు వీరిని ఉసిగొల్పుతున్నారని దుయ్యబట్టారు.

ఉగ్రవాదం సామాజికార్థిక అభివృద్ధికి పెనుముప్పుగా పరిణమించిందని అన్నారు. ఉగ్రవాదం స్వేచ్ఛాయుత ఆలోచనకు, భావప్రకటనపై దాడిగా పవన్‌ పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్‌ తన సొంత ప్రజలతో పాటు అది భారత్‌ నుంచి ఆక్రమించిన ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘన నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విమర్శ్‌ ఆర్యన్‌ యూఎన్‌హెచ్‌ఆర్‌సీ వేదికగా బదులిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన పాకిస్తాన్‌ అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించిందని, మానవ హక్కుల తీర్మానాలను తుంగలో తొక్కిందని అన్నారు. చదవండి : భార‌త ఆర్మీకి భ‌య‌ప‌డి ఏడ్చిన‌ చైనా జ‌వాన్లు!

మరిన్ని వార్తలు