ఐరాస వేదికగా పాక్‌ పీఎం ‘శాంతి’ మాటలు.. స్ట్రాంక్‌ కౌంటర్‌ ఇచ్చిన భారత్‌

24 Sep, 2022 11:12 IST|Sakshi

వాషింగ్టన్‌: ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) 77వ సమావేశాల వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు దీటుగా బదులిచ్చింది ఢిల్లీ. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. శాంతి కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్‌ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్‌ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు.
 
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రెటరీ మిజిటో వినిటో పాక్‌పై నిప్పులు చెరిగారు. ‘భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్‌ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబయిలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వినిటో. 

పాకిస్థాన్‌తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్‌ కాంక్షిస్తోందని పేర్కొన్నారు వినిటో. జమ్మూకశ్మీర్‌ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్‌ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్‌ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్‌ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు

మరిన్ని వార్తలు