బైడెన్‌ టీంలోకి మరో ఇండో అమెరికన్‌

19 Dec, 2020 12:18 IST|Sakshi
వైట్‌హౌజ్‌ అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీగా వేదాంత్‌ పటేల్‌

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన టీంలో భారత సంతతి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే కమలా హారిస్‌, నీరా టాండన్‌ వంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్‌ తాజాగా భారత సంతతికి చెందిన వేదాంత్‌ పటేల్‌ని అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీగా నియమించారు. పటేల్‌ ప్రస్తుతం బైడెన్‌ ఇనాగ్యురల్‌ కమిటీ సీనియర్‌ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక వైట్‌హౌస్‌ వ్యక్తిగత వెబ్‌సైట్‌ ప్రకారం పటేల్‌ బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించారు. అంతేకాక రీజనల్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇవేకాక బైడెన్‌ ప్రాధమిక ప్రచారంలో నెవడా, వెస్ట్రన్‌ ప్రైమరీ స్టేట్స్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక గతంలో, పటేల్‌ డెమోక్రటిక్ నేషనల్ కమిటీలో వెస్ట్రన్ రీజినల్ ప్రెస్ సెక్రటరీ, ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్‌కు, కాంగ్రెస్ సభ్యుడు మైక్ హోండాకు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. (చదవండి: నిరాడంబరంగా బైడెన్‌ ప్రమాణం)

ఇక నివేదిక ప్రకారం, పటేల్ భారతదేశంలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగారు. కాలిఫోర్నియా-రివర్సైడ్ విశ్వవిద్యాలయం, ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం పటేల్‌ తన కుటుంబంతో కలిసి వాషింగ్టన్‌ డీసీలో నివాసం ఉంటున్నారు. ఇక బైడెన్‌ శుక్రవాంర వైట్‌ హౌస్‌ కమ్యూనికేషన్‌, ప్రెస్‌ స్టాఫ్‌కు సంబంధించి 16 మంది పేర్లు ప్రకటించగా.. వారిలో వేదాంత్‌ పటేల్‌ కూడా ఉన్నారు. ఇక వైట్‌హౌస్‌ ప్రెస్‌ కమ్యునికేషన్‌ వింగ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వారిలో వేదాంత్‌ పటేల్‌ మూడవ వ్యక్తి. గతంలో ప్రియా సింగ్‌, రాజ్‌ షా వైట్‌ హౌస్‌ ప్రెస్‌ వింగ్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు.


 

మరిన్ని వార్తలు