-

బైడెన్‌ టీంలోకి మరో ఇద్దరు ఇండో అమెరికన్లు

23 Dec, 2020 10:35 IST|Sakshi
వినయ్‌ రెడ్డి, గౌతమ్‌ రాఘవన్‌

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలోకి మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చేరారు. వినయ్‌ రెడ్డి, గౌతమ్‌ రాఘవన్‌లకు బైడెన్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. తనకు దీర్ఘ కాలంగా సహాయకుడిగా ఉన్న వినయ్‌ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమించగా.. గౌతమ్‌ రాఘవన్‌కి కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక గతంలో రాఘవన్‌ వైట్‌హౌస్‌లో సీనియర్‌ అధికారిగా విధులు నిర్వహించారు.

ఇక వినయ్‌ రెడ్డి, రాఘవన్‌లతో పాటు మరో నలుగురికి బైడెన్ తన టీమ్‌లో చోటు కల్పించారు. వీరిలో గతంలో ఒబామా టీమ్‌లో పనిచేసిన అన్నె ఫిలిపిక్ ఉండగా.. ఆమెకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ డైరెక్టర్, మేనేజ్‌మెంట్.. ర్యాన్ మోంటోయా అనే ఒబామా మాజీ స్టాఫ్‌కు డైరెక్టర్‌ ఆఫ్ షెడ్యూలింగ్ అండ్‌ అడ్వాన్స్ బాధ్యతలు అప్పగించారు. బైడెన్‌తో చాలాకాలంగా పనిచేస్తున్న బ్రూస్ రీడ్‌కి డిప్యూటీ చీఫ్ స్టాఫ్, ఎలిజబెత్ విల్‌కిన్స్‌ని చీఫ్ స్టాఫ్‌ సీనియర్ అడ్వైజర్‌గా నియమించుకున్నారు. ఇప్పటికే కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌లకు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా బైడెన్ తన టీమ్‌లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. (చదవండి: అమెరికాను అగ్రపథంలో నిలుపుతాం!)

ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ‘నూతనంగా నియమితులైన అధికారులు తనతో కలిసి పాలసీలను రూపొందించడంలో.. అమెరికాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తారని’ వెల్లడించారు. రాఘవన్ గతంలో ఒబామా వైట్‌హౌస్‌ బృందంలోనూ సేవలందించారు. ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్‌ టీమ్‌లోనూ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. వినయ్‌ రెడ్డి బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నారు. ఇంతకు ముందు బైడెన్ క్యాంపెయిన్ స్టాఫ్‌గా పనిచేసిన వినయ్ ఇప్పుడు రైటర్స్ టీమ్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు