చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు

1 Jan, 2023 17:35 IST|Sakshi

చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చైనాలో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ఓ వైద్య విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. గత ఐదేళ్లుగా  చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన ఆ కుటుంబం తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది. 

వైద్య విద్య పూర్తి చేసేందుకు భారత్‌లోని తమిళనాడుకు చెందిన అబ్దుల్‌ షేక్‌ అనే యువకుడు ఐదేళ్ల క్రితం చైనాకు వెళ్లాడు. కరోనా వ్యాప్తి కారణంగా భారత్‌ తిరిగివచ్చిన అతను 20 రోజుల క్రితమే(2022 డిసెంబర్‌ 11)న తిరిగి చైనాకు వెళ్లాడు. 8 రోజుల ఐసోలేషన్‌ తర్వాత ఈశాన్య చైనాలోని హెయిలాంగ్జియాంగ్‌ రాష్ట్రంలోని కికిహార్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చేరాడు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో అతడిని ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. 

అనారోగ్యంతో తమ కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది ఆ కుటుంబం. అలాగే.. తమకు సాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్‌ మరణాలు

>
మరిన్ని వార్తలు