అఫ్గన్‌ గడ్డపై భారత బృందం.. తాలిబన్ల విన్నపాలు

3 Jun, 2022 08:54 IST|Sakshi

కాబూల్‌: అమెరికా బలగాల నిష్క్రమణ..  తాలిబన్‌ పాలన చేపట్టాక అఫ్గనిస్థాన్‌లో భారత బృందం తొలిసారి పర్యటించింది.  మానవతా సాయం పంపిణీ పర్యవేక్షణకు విదేశాంగ శాఖ జాయింట్‌ సెక్రెటరీ జేపీ సింగ్‌ నేతృత్వంలోని ఓ బృందం అఫ్గానిస్తాన్‌లో పర్యటిస్తోంది. 

తాలిబన్ల చేతిలోకి వెళ్లాక భారత బృందం అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. అఫ్గన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్‌, జేపీ సింగ్‌ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం భారత బృందం అక్కడి మంత్రితో భేటీ అయ్యింది. మానవతా సాయం పంపిణీ వివరాలను అడిగి తెలుసుకుంది.

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్‌కు ఇప్పుడు ప్రపంచ దేశాల సాయం అవసరం. ఈ నేపథ్యంలోనే భారత బృందం పర్యటిస్తోంది. ఇదే అదనుగా భారత్‌కు తమ విన్నపాలు చేసుకుంది తాలిబన్‌ ప్రభుత్వం. భారత్‌ సహకారంతో అఫ్గన్‌లో చేపట్టిన ప్రాజెక్టులను పునరుద్ధరించడంతో పాటు.. దౌత్యపరమైన సంబంధాలను సైతం కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. దీనికి భారత్‌ స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది.  

అలాగే వర్తక వాణిజ్యాలను సైతం కొనసాగించాలంటూ తాలిబన్‌ సర్కార్‌.. భారత్‌కు విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాలిబన్‌ పాలనకు మాత్రం ఇంకా భారత్‌ అధికారిక గుర్తింపు ఇవ్వని విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు