సెనెటర్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ

7 Aug, 2020 08:40 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన సారా గిడియాన్(48) అనే మహిళను మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆమోదించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో ఇది అత్యధిక పోటీ ఉండే సెనేట్ రేసుల్లో ఒకటి.  దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఒబామా ప్రకటించారు. ఆ పేర్లలో భారత సంతతికి చెందిన సారా గిడియాన్ కూడా ఉన్నారు. 48 ఏళ్ల ఎంఎస్ గిడియాన్ ప్రస్తుతం మైనే స్టేట్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు.  సారా గిడియాన్‌ను అభ్యర్థిగా పెడితే ఆ సెనెటర్ స్థానం డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన సెనెటర్ స్థానాల్లో మైనే రాష్ట్రం కూడా ఒకటి.

ఇటీవల వచ్చిన పోల్స్ ఫలితాల్లో కూడా సారా గిడియాన్‌కు ఎక్కువ శాతం మంది మద్దతు తెలిపినట్టు తేలింది. కాల్సిన్‌కు 44 శాతం లీడ్‌ ఉండగా సారా గిడియాన్‌ పోటీతో అది 39 శాతానికి పడిపోయింది. గిడియాన్‌ తండ్రిది భారత్‌, తల్లిది అమెరికా. ఆలోచనాత్మక, అధిక అర్హత కలిగిన వారిని సెనెటర్ అభ్యర్థులుగా ఆమోదించడం గర్వంగా ఉందని ఒబామా ఈ సందర్భంగా విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఆమోదించిన అభ్యర్థులందరూ ప్రజల కోసం పాటుపడతారని ఒబామా అన్నారు.

రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుతం సెనెటర్‌గా వ్యవహరిస్తున్న సూసన్ కాలిన్స్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సారా ఒకవేళ నవంబర్‌లో ఎన్నికైతే అమెరికా సెనెట్‌కు ఎన్నికైన రెండో ఇండియన్ అమెరికన్ మహిళ‌గా గుర్తింపు పొందుతారు.  సారా గిడియాన్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఇండియన్ అమెరికన్స్ సెనెట్‌కు పోటీ చేస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి మొట్టమొదటి సారి భారత సంతతి మహిళ అయిన కమలా హ్యారిస్ అమెరికా సెనేట్‌కు ఎన్నికయిన సంగతి తెలిసిందే. 

చదవండి: అన్నంత పని చేసిన ట్రంప్‌!

>
మరిన్ని వార్తలు