భారత సంతతి రీసెర్చర్‌ హత్య

4 Aug, 2020 14:12 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత సంతతి పరిశోధకురాలిని దుండగులు హత్య చేసిన టెక్సాస్‌ రాష్టంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్సాస్‌ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తోన్న 43 ఏళ్ల సర్మిస్త సేన్‌ ఆగస్టు 1న చిషోల్మర్‌ ట్రైల్‌ పార్క్‌ సమీపంలో జాగింగ్‌ చేస్తుండగా.. హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం లెగసీ డ్రైవ్‌, మార్చమన్‌ వే సమీపంలోని క్రీక్‌ ప్రాంతంలో లభ్యమయినట్లు పోలీసులు వెల్లడించారు. సర్మిస్త సేన్‌ ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు. మాలిక్యూలర్‌ బయాలజీ విభాగంలో, క్యాన్సర్‌ రోగుల కోసం పని చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఈ క్రమంలో పోలీసులు ఈ కేసుతో సబంధం ఉన్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితుడిని 29 ఏళ్ల బకారి అభియోనా మోన్‌క్రీప్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు కొల్లీన్‌ కౌంటీ జైలులో నిర్బంధంలో ఉన్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు. (మైక్రోసాఫ్ట్‌ ‘టిక్‌టాక్‌’ షో!)

సర్మిస్త హత్య జరిగిన సమయంలోనే.. మైఖేల్‌ డ్రైవ్‌లోని 3400 బ్లాక్‌లోని ఓ ఇంటిలోకి ఎవరో చొరబడ్డారని పోలీసులు తెలిపారు. బకారిని కూడా దోపిడి నేరం కింద అరెస్ట్‌ చేశారు. దాంతో సర్మిస్త హత్యతో అతడికి సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బకారిని విచారిస్తున్నారు. సర్మిస్త అథ్లెట్ కావడంతో‌ ప్రతిరోజు తన కుమారులు లేవడానికి ముందే జాగింగ్‌ చేయడానికి వచ్చేదని పోలీసులు తెలిపారు. సర్మిస్త మరణం ఆమె కుటుంబ సభ్యులను ఎంతో కలిచి వేసింది. ఆమె చాలా మంచిదని.. పరిచయం అయిన ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతో కట్టిపడేసేదని సర్మిస్త కుటుంబ సభ్యులు తెలిపారు. గొప్ప వారికే ఎందుకు ఇలా జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు