మెక్సికోలో భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

23 Oct, 2021 17:27 IST|Sakshi

లాస్‌ఏంజిల్స్‌: మెక్సికోలో మాదక ద్రవ్యాల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ప్రమాదవశాత్తూ భారత సంతతి మహిళ సహా ఇద్దరు మృత్యువాతపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన టెకీ, ట్రావెల్‌ బ్లాగర్‌ అయిన అంజలి రియోట్‌(25) ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ఉంటున్నారు. ఈ నెల 22వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు భర్త ఉత్కర్ష్‌ శ్రీవాస్తవతో కలిసి సోమవారం ఆమె మెక్సికోలోని తీరప్రాంత రిసార్ట్‌ టులుమ్‌కు వెళ్లారు. బుధవారం రాత్రి అంజలి మరో నలుగురు కలిసి అక్కడి రెస్టారెంట్‌లోని టెర్రస్‌పై ఉండగా, సాయుధ దుండగులు ప్రవేశించి వారున్న ప్రాంతంలో యథేచ్ఛగా కాల్పులు ప్రారంభించారు.

ఈ కాల్పుల్లో అంజలి, మరో మహిళ చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. డ్రగ్స్‌ నేరగాళ్ల ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ప్రమాదవశాత్తూ వీరు బలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ నుంచి లింక్డ్‌ ఇన్‌లో ఆమె సీనియర్‌ సైట్‌ రిలయబిలిటీ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అంజలి మరణ వార్తను నమ్మలేకపోతున్నామని సిమ్లాలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు కె.డి.రియోట్, నిర్మల కన్నీటి పర్యంతమయ్యారు.  అంజలి భర్త ఉత్కర్ష్‌ది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌. నెట్‌ఫ్లిక్స్‌లో సీనియర్‌ మేనేజర్‌గా ఉన్నారు.  

చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..) 

మరిన్ని వార్తలు