చైనాలో ఇన్‌ఫ్లూయెంజా పంజా

14 Mar, 2023 06:33 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో ఇన్‌ఫ్లూయెంజా (హెచ్‌3ఎన్‌2) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఫ్లూ పాజిటివ్‌ కేసుల రేటు 41.6 శాతం పెరిగినట్లు చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తాజాగా ఒక నివేదికలో వెల్లడించింది. మునుపటి వారంతో పోలిస్తే 25.1 శాతం ఎక్కువ పెరుగుదల నమోదైనట్లు తెలియజేసింది. షాంగ్జీ ప్రావిన్స్‌లోని జియాన్‌ నగరంలో ఇన్‌ఫ్లూయెంజా కేసుల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

ఫ్లూ వ్యాప్తి మరింతగా పెరిగితే లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు. హాంకాంగ్‌ వైరస్‌గా పిలిచే హెచ్‌3ఎన్‌2 వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరణాలు సైతం నమోదయ్యాయి. ఈ వైరస్‌ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు, శరీరంలో నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, చైనాలో కోవిడ్‌–19 పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గడం విశేషం.  

మరిన్ని వార్తలు