భారత్‌కు అంతర్జాతీయ మద్దతు.. పలు దేశాల సహాయం

27 Apr, 2021 08:55 IST|Sakshi

డబ్ల్యూహెచ్‌వో, యూకే సాయం

ఆక్సిజన్, మందులు అందిస్తాం: ఈయూ

వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపనున్న ఆస్ట్రేలియా

వాషింగ్టన్‌/ మెల్‌బోర్న్‌/జెనీవా: మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులో భాగంగా అత్యవసర వైద్య పరికరాలను, సామగ్రిని అందజేయడంతోపాటు భారత్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తామని అమెరికా, యూకే, యూరోపియన్‌ యూనియన్, శ్రీలంక, ఆస్ట్రేలియా హామీ ఇచ్చాయి. భారత్‌ను ఆదుకుంటామని అమెరికా  ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ చెప్పారు.  ‘భారత్‌లో పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అదనపు సాయం, సరఫరాలను తక్షణం అందించేందుకు భారత ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నాం’ అని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఎయిరిండియా విమానం ఒకటి 318 ఫిలిప్స్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో సోమవారం న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. 

సీరమ్‌కు ముడిపదార్థాలు... 
కోవిషీల్డ్‌కు తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతిపై అమెరికా విధించిన నిషేధాన్ని ఎత్తివేసి.. తక్షణం కావాల్సిన ముడిసరుకులను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అందజేస్తామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సలివాన్‌ ఆదివారం రాత్రి భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ధోవల్‌కు ఫోన్‌లో తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పతికి కావాల్సిన ముడిపదార్థాలతో పాటు కోవిడ్‌ చికిత్సలో మందులు, ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్స్, వెంటిలేటర్లు, ఆక్సిన్‌ ఉత్పత్తి.. సంబంధిత పరికరాలు, వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సాయం అందించడం, అమెరికా ప్రజారోగ్య వైద్యనిపుణులను మొహరించడం చేస్తున్నామని అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి వెల్లడిం చారు. భారత్‌ కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అత్యవసరంగా ఆక్సిజన్, మందులు అందిస్తామని యూరోపియన్‌ యూని యన్‌ (27 సభ్య దేశాలున్నాయి) ప్రకటించింది. 

డబ్ల్యూహెచ్‌వో, యూకే సాయం
భారత్‌లో కరోనా కేసుల తీవ్రతను హృదయ విదారకాన్ని మించిన పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధ్యక్షుడు అభివర్ణించారు.  ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన మొదటి ఐదు నెలల్లో మాదిరిగానే అనేక దేశాల్లో గత వారం రోజులుగా కేసులు నమోదవుతున్నాయన్నారు. వేల సంఖ్యలో పోర్టబుల్‌ ఆక్సిజన్‌ మిషన్లతోపాటు అత్యవసరమైన సామగ్రిని పంపిస్తున్నట్లు తెలి పారు. మహమ్మారి ఎదుర్కొనే క్రమంలో భారత ప్రభుత్వ యంత్రాంగానికి సాయ పడేందుకు 2 వేల మంది సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా, భారత్‌కు అత్యవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు పంపినట్లు యూకే తెలిపింది. వారంలోగా 495 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 120 నాన్‌ ఇన్వేజివ్‌ వెంటిలేటర్లు, 20 మాన్యువల్‌ వెంటిలేటర్లను పంపుతామంది.

ఆక్సిజన్, వెంటిలేటర్లు పంపుతాం: ఆస్ట్రేలియా 
అత్యవసర మద్దతు కింద భారత్‌కు ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపుతామని ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్‌ హంట్‌ సోమవారం తెలిపారు. భారత్‌ ఆక్సిజన్‌ కొరతతో అల్లాడిపోతోందని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా కేబినెట్‌ జాతీయ భద్రతా కమిటీ మంగళవారం సమావేశమై భారత్‌ను సాయంపై చర్చించనుంది. అలాగే భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించే ఆంశాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిశీలిస్తోంది.   

కరోనాను ఎదుర్కొనేందుకు సహాయం చేస్తాం: ఫ్రాన్స్‌
కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు అండగా ఉంటామని ఫ్రాన్స్‌ సంఘీభావం ప్రకటించింది. ఇందులో భాగంగా 2 వేల మందికి సరిపడే లిక్విడ్ ఆక్సిజన్ పంపుతున్నట్టు ప్రకటించింది. అదే విధంగా, 250 బెడ్లకు ఏడాదంతా ఆక్సిజన్ సరఫరా చేయగల జనరేటర్, ఐసీయూ పరికరాలు, 28 వెంటిలేటర్లు పంపుతున్నట్టు వెల్లడించింది.

చదవండి: కోవిడ్‌పై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు

మరిన్ని వార్తలు