పాపం..! డ్యాన్స్‌ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష

2 Feb, 2023 12:34 IST|Sakshi

ఇరాన్‌లో హిజాబ్‌ విషయమై ప్రజలపై కఠిన ఆంక్షలను విధిస్తూ కట్టడి చేస్తున​ సంగతి విదితమే. ఐతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్‌ అయిన ఒక జంట సరదాగా బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్‌ చేశారు. అంతే వారిపై పలు కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించింది ఇరాన్‌ ప్రభుత్వం. వివరాల్లోకెళ్తే.. 21 ఏళ్ల అస్తియాజ్‌ హకికీ, ఆమెకు కాబోయే భర్త మొహమ్మద్‌ అహ్మదీ టెహ్రాన్‌లోని ఆజాది టవర్‌ వద్ద డ్యాన్స్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియోని ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది.

దీంతో ఇరాన్‌ పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు వారిపై వ్యభిచారాన్ని ప్రోత్సహించడం, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు, అవినీతి వంటి తదితర అభియోగాలు మోపారు. దీంతో వారికి ఆయా నేరాలన్నింటికీ కలిపి సుమారు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఐతే ఒక్కొక్క అభియోగంలో వారు దోషులుగా తేలినట్లయితే ఇంకెంత శిక్ష పడుతుందనేది చెప్పలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పాపం ఆ జంటకు ఇన్‌స్టాగ్రామ్‌ వేలాది ఫాలోవర్స్‌ ఉన్నారు. పైగా ఇరాన్‌ నిరసనలను లింక్‌ చేస్తూ కూడా వారు డ్యాన్స్‌లు చేయలేదు.

కానీ ఇరాన్‌ ప్రజలను కర్కశంగా అణచివేసే పనిలో భాగంగా ఆ జంటపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసి కటకటాలపాటు చేసింది సర్కార్‌. ఇదిలా ఉండగా.. ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అదీగాక 21 ఏళ్ల మహ్సా అమినీ హిజాబ్‌ చట్టాలను ఉల్లంఘించిందంటూ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తదనంతరం ఆమె కస్టడీలో మృతి చెందడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెచ్చకున్నాయి. దీంతో మానవహక్కుల కార్యకర్తలు, ప్రజలు, పెద్ద సంఖ్యలో యువత బహిరంగ నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకింది.

(చదవండి: సంక్షోభానికి చివరి అంచున నిలబడ్డ పాక్‌! చివరికి శ్రీలంకలానే..)

మరిన్ని వార్తలు