బద్ధ శత్రువులైన ఇరాన్‌, సౌదీల మధ్య సయోధ్య కుదిర్చిన చైనా!

17 Mar, 2023 19:05 IST|Sakshi

అరబ్‌ ప్రపంచంలోన బద్ధ శత్రువులైన ఇరాన్‌, సౌదీలు మద్య సంబంధాలు మళ్లీ పెనవేసుకుంటున్నాయి. ఆ రెండు దేశాలు దౌత్య సంబంధాల పునరుద్ధరణకు చైనా మధ్యవర్తితం వహించి సయోధ్య కుదిర్చింది. ఇరు దేశాలు సంబంధాలు తెంచుకున్న ఏడేళ్ల అనంతరం ఒక్కటవుతున్నారు. ఈ మేరకు ఇరు దేశాలు తమ శత్రుత్వాన్ని పక్కన పెట్టి పూర్తి స్తాయిలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అంగీకరించాయి. 

ఈ నేపధ్యంలో ఇరాన్‌ రాయబారి ఇరాజ్‌ ఎలాహి మాట్లాడుతూ..చైనా మధ్యవర్తిత్వంతో ఏర్పడిన ఇరాన్‌- సౌదీల ఒప్పందం ప్రాంతీయ సుస్థిరత్వాన్ని అందిస్తుంది. ఇది భారత్‌కు ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇది భారత్‌కి ఎంతమాత్రం ఆందోళ కలిగించదనే భావిస్తున్నా. ఇది పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో సుస్థిరత, శాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

దీని ఫలితంగా ఈ ప్రాంతంలోని వివిధ దేశాలతో భారత్‌ తన వాణిజ్య సంబంధాలు సులభంగా నెరపగలుగుతుంది అని అన్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి మాట్లాడుతూ.. చైనా ప్రస్తావన ఎత్తకుండానే.. విభేదాలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యాన్ని సమర్థించే భారత్‌ ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తుందని  అన్నారు. పశ్చిమ ఆసియాలోని వివిధ దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాలతో లోతైన అనుబంధం ఉందని చెప్పారు.

ఇదిలా ఉండగా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) రెండింటితో వాణిజ్య సంబంధాల విస్తరణను ఆశిస్తున్నట్లు ఇరాన్‌ రాయబారి ఎలాహి చెప్పారు. తమ మధ్య అంతరాన్ని తగ్గించి భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం మంచి ప్రయోజకరంగా ఉంటుందని అన్నారు. కాగా, బైడెన్‌ అమెరికా అధ్యక్షుడైన తర్వాత నుంచి సౌదీ, అమెరికాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ తరుణంలో చైనా అరబ్‌ దేశాలకు దగ్గర అయ్యే ఎత్తుగడలు ప్రారంభించడం గమనార్హం. 

(చదవండి: రష్యాను సందర్శించనున్న జిన్‌పింగ్‌..నాలేగేళ్ల తర్వాత తొలిసారిగా..)

మరిన్ని వార్తలు