ఇరాన్‌ శాస్త్రవేత్త దారుణహత్య

28 Nov, 2020 10:45 IST|Sakshi

టెహ్రాన్‌ : ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ న్యూక్లియర్‌ శాస్త్రవేత్త మొహ్‌సేన్‌ ఫక్రీజాదే(59) శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. టెహ్రాన్‌లో శివారులో తన వాహ‌నంలో వెళ్తున్న ఫ‌క్రిజాదేపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. అయితే తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఇరాన్ ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన రీస‌ర్చ్ అండ్ ఇన్నోవేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ అధిప‌తిగా ఫ‌క్రిజాదే ప‌నిచేశారు.ఈ హత్య వెనుక ఇజ్రాయెల్‌  హస్తం ఉన్నట్లు ఇరాన్‌  ఆరోపించింది. ఈ సందర్భంగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. టెహ్రాన్‌లో హత్యకు గురైన మొహసేన్‌ వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉందని.. అయితే హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా ఇరాన్‌ ప్రయత్నిస్తుందని లేఖలో తెలిపారు. (చదవండి : మాంసం ముద్దలు విసురుతూ నిరసన)

'ఇరాన్ శాస్త్రవేత్త ఫక్రీజాదేను ఉగ్రవాదులు దారుణ హత్య చేశారు. ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ నేరస్తుల పిరికితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హత్య తాము చేయలేదంటూ డబుల్‌ గేమ్‌ ఆడుతున్న ఇజ్రాయెల్‌ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మా శాస్త్రవేత్త హత్యకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం.' కాగా గతంలోనూ ఫక్రీజాదేపై పలుసార్లు హత్యాయత్నాలు జరిగినా తృటిలో తప్పించుకున్నారు. అయితే ఈ హత్యపై ఇజ్రాయెల్‌ ఇంతవరకు స్పందించలేదు.
 

మరిన్ని వార్తలు