తీరని విషాదం: తొక్కిసలాటలో 44 మంది మృతి

30 Apr, 2021 15:57 IST|Sakshi

జెరూసలెం: పవిత్ర పండుగ వేళ తొక్కిసలాట జరిగి 44 మంది మృతి చెందారు. భయాందోళనతో పరుగులు తీయడంతో తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన ఇజ్రాయెల్‌ దేశంలోని మౌంట్‌ మెరోన్‌ పవిత్ర స్థలం వద్ద చోటుచేసుకుంది. లాగ్‌ బౌమర్‌ పండుగ గురువారం యూదులు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి పవిత్ర స్థలం అయిన మౌంట్‌ మెరోన్‌ వద్దకు పెద్ద ఎత్తున యూదులు చేరుకున్నారు. ఉమ్మడిగా ప్రార్థనలు, నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగారు.

ఈ సమయంలో కొందరు మెట్లపై అదుపు తప్పి కిందపడ్డారు. కింద ఉన్నవారిపై వీరు పడడంతో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో అందరూ భయాందోళన చెంది పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. వేలాది మంది పరుగులు పెట్టడంతో తొక్కిసలాటలో కిందపడ్డవారు ప్రాణాలు కోల్పోయారు. ఆ పవిత్ర స్థలం ప్రాంగణమంతా రక్తసిక్తమైంది. చెప్పులు.. బట్టలు చిందరవందరగా పడి హృదయ విదారకంగా మారింది. తొక్కిసలాటలో ఊపిరాడక ఏకంగా 44 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇక తీవ్రంగా గాయపడిన 108 మందిని ఆస్పత్రికి తరలించారని ఆ దేశానికి చెందిన అధికారులు ప్రకటించారు. వారిలో 40 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నెతన్యాహు సందర్శించారు. ఈ ఘటనపై పలు దేశాల ప్రముఖులు కూడా స్పందించి సంతాపం ప్రకటించారు. అయితే ఈ వేడుకలో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది.

చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి
చదవండి: ఇప్పటివరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..
 

మరిన్ని వార్తలు