దేవాస్‌కు 8,939 కోట్లివ్వండి

31 Oct, 2020 04:01 IST|Sakshi

యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌కు అమెరికా కోర్టు ఆదేశం

వాషింగ్టన్‌: శాటిలైట్‌ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసినందుకు గాను బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ దేవాస్‌ మల్టీమీడియాకు రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్‌ డాలర్లు) నష్ట పరిహారం చెల్లించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌ను అమెరికా న్యాయస్థానం ఆదేశించింది. 2005 జనవరిలో ఈ ఒప్పందం కుదిరింది. 70 మెగాహెట్జ్‌ ఎస్‌–బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను దేవాస్‌ మల్టీమీడియాకు అందించేందుకు రెండు ఉపగ్రహాలను నిర్మించి, ప్రయోగించి, నిర్వహిస్తామని యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌ హామీ ఇచ్చింది. అయితే, ఒప్పందం మేరకు స్పెక్ట్రమ్‌ను దేవాస్‌కు ఇవ్వడంలో యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌ విఫలమైంది.

2011 ఫిబ్రవరిలో ఒప్పందాన్ని యాంట్రిక్స్‌ రద్దు చేసింది. అనంతరం దేవాస్‌ భారత్‌లో పలు కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సైతం పిటిషన్‌ దాఖలు చేసింది. తమకు న్యాయం చేయాలని విన్నవించింది. సరైన స్పందన లేకపోవడంతో 2018లో అమెరికాలోని వెస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి థామస్‌ ఎస్‌.జిల్లీ అక్టోబర్‌ 27న ఉత్తర్వు జారీ చేశారు. దేవాస్‌ సంస్థకు 562.5 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని, ఇప్పటిదాకా వడ్డీతో కలిపి రూ.8,939.79 కోట్ల(1.2 బిలియన్‌ డాలర్లు)ను దేవాస్‌ మల్టీమీడియాకు చెల్లించాలని యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌కు తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు