అడవిలో తల్లి శవం.. కొడుకు కోసం గాలింపు చర్యలు

13 Aug, 2020 20:29 IST|Sakshi

రోమ్‌: ఓ తల్లి తన బిడ్డను తీసుకుని షాపింగ్‌కని వెళ్లింది. ఐదు రోజుల తర్వాత శవమై కనిపించింది. ఆమెతో పాటు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం ఇటలీ పోలీసులు ఆ చిన్నారి కోసం వెతుకుతున్నారు. వివరాలు.. వివియాని పారిసి(43) అనే మహిళ ఈ నెల 3న నాలుగేళ్ల తన కొడుకు జియోలేకి షూస్‌ కొనడం కోసం మెస్సినా వెళుతున్నాను అని తన భర్తకు చెప్పి.. కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లింది. అయితే వెళ్లే దారిలో రోడ్డు రిపేర్‌ ఉండటంతో సిసిలీలోని మోటార్‌వే దారి గుండా వెళ్లింది. ఐదు రోజుల తర్వాత ఆమె మృతదేహం కరోనియా పట్టణం సమీపంలోని ఓ అడవిలో కుళ్లిన స్థితిలో లభ్యమయ్యింది. ఆమెతో పాటు వెళ్లిన నాలుగేళ్ల జియోలే ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. (30 నిమిషాల్లో హ్యాకింగ్‌, విస్తుపోయే నిజాలు!)

ఈ క్రమంలో ఓ అధికారి మాట్లాడుతూ.. ‘కొందరు పారిసి చేతిలో పిల్లడిని చూశామని చెప్పారు. మరి కొందరు ఆమె ఒంటరిగా నడిచి వెళ్లడం చూశామన్నారు. పారిసి చెయ్యి దారుణంగా విరిగిపోయింది. ఇది తప్ప ఆమె శరీరం మీద ఇంకా ఎలాంటి గాయాలున్నాయో తెలీడం లేదు. ఆమె గొంతు కోసి చంపి ఉంటారనే అనుమానం ఉంది. కానీ శరీరం తీవ్రంగా కుళ్లిపోవడం చేత ప్రస్తుతానికి ఏం చెప్పలేకపోతున్నాం. పోస్టుమార్టం రిపోర్టు వస్తే ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఇక ఆమె పిల్లాడు జియోలే తప్పి పోయి అయినా ఉండాలి. లేదా దుండగులు ఆమెను హత్య చేసి పిల్లాడిని లాక్కెళ్లి ఉంటారని అనుమానిస్తున్నాం. ప్రస్తుతం జియోలేని క్షేమంగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఇటలీలో సంచలనం రేపుతోంది. పోలీసుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జియోలే తండ్రి డేనియల్ మొండెలో మీడియాతో మాట్లాడుతూ తన భార్య డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇది కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల అది తీవ్రతరం అయ్యిందన్నాడు. అయితే పారిసి ఎవరికి హాని కలిగించదని ఆమె స్నేహితులు మీడియాకు తెలిపారు. 
 

మరిన్ని వార్తలు