అణు ఆయుధాలను నిషేధించండి: జపాన్‌

10 Aug, 2020 09:35 IST|Sakshi

టోక్యో: అణుఆయుధాలను నిషేధించాలని జపాన్‌దేశం మరోసారి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. అగ్రరాజ్యం అమెరికా జపాన్‌లోని రెండు ముఖ్య నగరాలైన హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. నాగసాకి నగరంపై దాడి జరిగి ఆదివారం నాటికి(ఆగస్టు 9) 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం నాగసాకి పీస్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార యంత్రాంగంతో పాటు పౌరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగసాకి నగర మేయర్‌ టొమిహిమ టావ్‌ శాంతి సందేశాన్ని ఇచ్చారు. అణుఆయుధాలను నిషేధించాలని మేము విజ్ఞప్తి చేస్తుంటే.. అమెరికా, రష్యాలు మాత్రం అణుఆయుధాల శక్తిని పెంచుకుంటున్నాయని ఆరోపించారు. (లిటిల్‌ బాయ్‌ విధ్వంసం.. టార్గెట్‌ హిరోషిమానే ఎందుకు?)

2017లో ఏర్పాటు చేసిన అణుఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆయన ప్రపంచ దేశాలతోపాటు, జపాన్‌ ప్రభుత్వఅధికారులను కోరారు. జపాన్‌ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. అణుఆయుధాల ట్రీటీ ఒప్పందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అణుఆయుధాలు తయారు చేస్తున్న రాష్ట్రాలు, అణురహిత రాష్ట్రాలు కూడా దీనికి మద్దతు ఇవ్వవని ఆయన అన్నారు. రష్యా, అమెరికా దేశాలు తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను తగ్గించుకోవాలని కోరారు. న్యూక్లియర్‌ ప్రొలిఫిరేషన్‌ ట్రీటీ అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచినా దానిని ఎవరూ పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 1945 ఆగస్టు 6,9 తేదీలలో జరిగిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు అణుబాంబుల దాడితో ఆగస్టు 15న జపాన్‌ యుద్ధం నుంచి వెనక్కి తగ్గడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. (అణుబాంబు విలయానికి 75 ఏళ్లు)

మరిన్ని వార్తలు