భారతీయ అమెరికన్‌ మహిళకు కీలక పదవి

23 Nov, 2020 05:22 IST|Sakshi

జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ

వాషింగ్టన్‌/మంగళూరు: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ భారతీయ అమెరికన్‌ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ(47)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధ విషయాల్లో కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు మాలా సహకరిస్తారు. ప్రస్తుతం ఆమె బైడెన్‌ 2020 ప్రచార కార్యక్రమానికి సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌గా, బైడెన్‌కు సీనియర్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.

మాలా గతంలో బైడెన్‌ ఫౌండేషన్‌కు హయ్యర్‌ ఎడ్యుకేషన్, మిలటరీ ఫ్యామిలీస్‌ విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు, ఒబామా హయాంలో ఎడ్యుకేషనల్, కల్చరల్‌ బ్యూరోలో డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫర్‌ స్టేట్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు.   మరికొన్ని కీలక నియామకాలను కూడా బైడెన్‌ శనివారం ప్రకటించారు. యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో లా స్కూల్‌లో జూరిస్‌ డాక్టర్‌ డిగ్రీ, మిన్నెసొటా యూనివర్సిటీలో పబ్లిక్‌ హెల్త్‌లో పీజీ చేశారు. అయెవాలోని గ్రిన్నెల్‌ కాలేజీలో స్పానిష్‌లో బీఏ డిగ్రీ చదివారు.

ఉడుపిలో మూలాలు: జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగను నియమించడంపై ఆమె సొంత రాష్ట్రం కర్ణాటక ఉడుపి జిల్లా కక్కుంజే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. వాస్క్యులర్‌ సర్జన్‌లో నైపుణ్యాలు పెంచుకునేందుకు ఆమె అమెరికా వెళ్లారు. మాలా తల్లిదండ్రులు డాక్టర్‌ రమేశ్‌ అడిగ, డాక్టర్‌ జయ అడిగ. రమేశ్‌ కుటుంబానికి చెందిన సూర్యనారాయణ కర్ణాటక బ్యాంక్‌ లిమిటెడ్‌ను స్థాపించగా, అరవింద్‌ అడిగ 2008 మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ విజేతగా నిలిచారు. మాలాకు భర్త చార్లెస్, కుమార్తె ఆషా ఉన్నారు. గత ఏడాది బెంగళూరులోని జరిగిన కార్యక్రమానికి మాలా కుటుంబంతో కలిసి హాజరయ్యారని ఆమె మేనత్త నిర్మలా ఉపాధ్యాయ్‌ తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనంలో సీనియర్‌ స్టాఫర్‌గా నియామకం కాబోతున్నట్లు శనివారం మాలా తనకు తెలిపినట్లు నిర్మలా చెప్పారు. బబ్బరిఅనకట్టే గ్రామంలోని పూర్వీకుల ఇంటిని ఆమె సందర్శించారనీ, కక్కుంజే గ్రామంలోని ఆలయంలో పూజలు చేశారన్నారు.

మరిన్ని వార్తలు