చైనా విషయంలో ట్రంప్‌ బాటలో బైడెన్‌

5 Jun, 2021 12:59 IST|Sakshi

వాషింగ్టన్‌: తమ దేశంలోని పెట్టుబడిదారులతో భాగస్వామ్యం ఉన్న చైనా కంపెనీలపై అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఆయా కంపెనీలకు చైనా సైన్యం, నిఘా సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తోంది. అందుకే తమ దేశంలో పెట్టుబడులు పెట్టే కొన్ని చైనా కంపెనీలపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో తాజాగా మరికొన్ని కంపెనీలను చేర్చింది. వ్యాపార, సాంకేతిక రంగాల్లో అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న కొన్ని చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ గతంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

మరికొన్ని కంపెనీలపైనా ఆంక్షలను అమల్లోకి తీసుకొస్తూ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ప్రభుత్వం ఆ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలని చైనా కోరింది. అమెరికాలో చైనా కంపెనీలకు సానుకూల పెట్టుబడి, వ్యాపార వాతావరణాన్ని కల్పించాలని తెలిపింది. తమ సంస్థలు, కంపెనీలపై ఎలాంటి వివక్ష చూపొద్దని కోరింది. చైనా కంపెనీల హక్కుల పరిరక్షిస్తామని తెలిపింది.
చదవండి: Facebook షాక్‌: ట్రంప్‌ కౌంటర్‌

మరిన్ని వార్తలు