US Afghanistan Exit: ఇకపై విదేశీ గడ్డ మీద అడుగుపెట్టకుండానే: బైడెన్‌

1 Sep, 2021 15:21 IST|Sakshi

వాషింగ్టన్‌: అఫ్గనిస్తాన్‌ నుంచి తమ బలగాలు ఉపసంహరించుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించుకున్నారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘ఇది సరైన, తెలివైన నిర్ణయం. అమెరికాకు మేలు చేసే అత్యుత్తమ నిర్ణయం’’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ‘‘అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ప్రజలు, మిలిటరీ సలహాదారులు, సర్వీస్‌ చీఫ్‌లు.. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో(అఫ్గన్‌) పనిచేస్తున్న సైనికులు కోరుకున్నారు’’ అని పేర్కొన్నారు. సైన్యాన్ని వెనక్కి రప్పించడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని, గతం మరిచి మెరుగైన భవిష్యత్తుకై ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అన్నారు.

అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో జో బైడెన్‌ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ..  ‘‘అఫ్గన్‌స్తాన్‌ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు మన సైనికులు వారి ప్రాణాలను పణంగా పెట్టారు. ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ‘‘ఇది యుద్ధం కోసం చేపట్టిన చర్య కాదు.. దయా హృదయంతో కూడిన మిషన్‌’’. ఒక్క అమెరికా తప్ప.. ప్రపంచ చరిత్రలో ఏ దేశం ఇంత గొప్పగా వ్యవహరించలేదు. బలగాల ఉపసంహరణ నిర్ణయానికి పూర్తి బాధ్యత నాదే’’ అని పేర్కొన్నారు.

విదేశీ గడ్డ మీద అడుగుపెట్టకుండానే..
‘‘అఫ్గనిస్తాన్‌లో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధాన్ని ముగించే క్రమంలో సవాళ్లు ఎదుర్కొన్న నాలుగో అధ్యక్షుడిని నేను. నా ముందు ప్రెసిడెంట్‌గా పనిచేసిన వారు మే 1న తాలిబన్లతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. అమెరికా బలగాలను వెనక్కి పిలిపిస్తామని అంగీకరించారు. నేను సైతం.. యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా ప్రజలకు మాట ఇచ్చాను. దానిని నిలబెట్టుకున్నాను. 

ఇక అఫ్గన్‌ లేదా ఇతర ప్రపంచ దేశాల్లో అమెరికా సైనికులు అడుగుపెట్టకుండానే ఉగ్రవాదాన్ని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటాం. అతి తక్కువ మంది సేవలను ఉపయోగించుకుంటాం. అమెరికాకు గానీ, మా మిత్ర దేశాలకు గానీ ఎటువంటి హాని తలపెట్టాలని చూసినా మేం సహించం. అటువంటి వారిని క్షమించం. వాళ్లు మూల్యం చెల్లించక తప్పదు. వెంటాడి, వేటాడి మట్టుబెడతాం’’ అని ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.  

చదవండి: Taliban: ‘రష్యా, అమెరికాలను ఓడించారు’ సరే.. మరి అసలు సమస్య?!

మరిన్ని వార్తలు