శ్వేతసౌధం ఒక బంగారు పంజరం: బైడెన్‌

18 Feb, 2021 02:44 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌ నాలుగు వార్లాలోనే వైట్‌హౌస్‌లో జీవితాన్ని ఒక బంగారు పంజరంతో పోల్చారు. గతంలో అధ్యక్షులుగా ఉన్నవారంతా శ్వేతసౌధంలో నివసించడమంటే పూతపూసిన బంగారం లాంటి పంజరంలో ఉన్నట్టు ఉంటుందని అనేవారని, అందులో వాస్తవ ఉందని అన్నారు. మంగళవారం సీఎన్‌ఎన్‌ టౌన్‌హాలు కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్‌ మాట్లాడుతూ ప్రతీరోజూ పొద్దున్నే లేవగానే ఎక్కడున్నానో తనకి ఒక్కక్షణం అర్థం కాదని అన్నారు. తన సతీమణి జిల్‌ని మనం ఎక్కడున్నామని ప్రశ్నిస్తూ ఉంటానని బైడెన్‌ జోక్‌ చేశారు.

వైట్‌హౌస్‌ సిబ్బంది అనుక్షణం తన వెంటే ఉంటూ ప్రతీది తనకి అందిస్తూ ఉంటే అది తనకు అసలు నచ్చడం లేదని బైడెన్‌ చెప్పారు. తనకోసం వారంతా వెయిట్‌ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ‘‘నేను అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాను. ఇంకెవరో వచ్చి నేను ధరించాల్సి సూటు కూడా తీసి ఇస్తూ ఉంటే జీర్ణించుకలేకపోతున్నాను’’అని బైడెన్‌ చెప్పారు. గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్‌హౌస్‌ కొత్త కాకపోయినా అందులో నివాసం ఉండలేదన్నారు. వైట్‌హౌస్‌ సిబ్బంది వ్యక్తిగత పనులు చేయ డం వల్ల ఊపిరి ఆడక బంగారు పంజరంలో ఉన్నట్టుగా అనిపిస్తోందని బైడెన్‌ చెప్పారు. ప్రస్తుతం తను పూర్తిగా పనిలో పడిపోయాయని, అందుకే ఒక్కోసారి అధ్యక్షుడిగా నాలుగు వారాలు కాదు, నాలుగేళ్లు అయినట్టుందని వ్యాఖ్యానించారు. 

చదవండి: (పార్లమెంట్‌ హౌజ్‌లోనే అత్యాచారం)

(అమెరికా మరింత నాగరికం కాబోతోందా?)

మరిన్ని వార్తలు