సొంత ప్రాంతం వీడుతూ జో బైడెన్‌ భావోద్వేగం

20 Jan, 2021 11:37 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌ బుధవారం వాషింగ్టన్‌ బయల్దేరారు. అమెరికాలోని డెలావర్‌ నుంచి వాషింగ్టన్‌కు పయనమయ్యారు. అంతకుముందు డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఆయనకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సభలో జో బైడెన్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "నా చివరి శ్వాస వరకు డెలావర్ ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఇక్కడ లేకపోవడం నన్ను బాధిస్తున్న.. మీరు నన్ను ఇక్కడి నుంచి అధ్యక్షుడిని చేసి పంపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు. 

కరోనాతో మరణించిన వారికి మంగళవారం రాత్రి బైడెన్‌ దంపతులతో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్‌ దంపతులు నివాళులర్పించారు. 4 లక్షల మంది అమెరికా పౌరులను కరోనా వలన కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 

బైడెన్‌ ప్రమాణానికి వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనం ముస్తాబైంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ బుధవారం రాత్రి 10.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే బైడెన్ కంటే ముందు ఉపాధ్యక్షురాలు కమలాదేవి హ్యారిస్ ప్రమాణస్వీకారం చేస్తారు.

మరిన్ని వార్తలు