ఎట్టకేలకు గార్సెట్టి ఎంపిక ఖరారు

17 Mar, 2023 05:05 IST|Sakshi

వాషింగ్టన్‌: రెండు సంవత్సరాలకుపైగా ఎటూ తేలని భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టి ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. అమెరికా పార్లమెంట్‌ ఎగువసభలో జరిగిన ఓటింగ్‌లో 52–42 ఓటింగ్‌ ఫలితంతో గార్సెట్టి నామినేషన్‌ గండాన్ని విజయవంతంగా గట్టెక్కారు. దీంతో భారత్‌లో అమెరికా రాయబారిగా గార్సెట్టి త్వరలో నియామకం కానున్నారు. తొలిసారిగా 2021 జూలైలో గార్సెట్టిని భారత్‌లో అమెరికా రాయబారిగా నామినేట్‌ చేస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు.

లాస్‌ ఏంజెలిస్‌ నగర మాజీ మేయర్‌ అయిన గార్సెట్టిపై పలు లైంగిక వేధింపులు, ఆధిపత్య ధోరణి ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లూ అమెరికా నూతన రాయబారి వ్యవహారం సందిగ్ధంగా ఉండటంతో చరిత్రలో తొలిసారిగా 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా భారత్‌లో అమెరికా రాయబారిగా ఎవరూ లేరు. కాగా, బైడెన్‌కు సన్నిహితుడు నూతన రాయబారిగా వస్తుండటంతో భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపడతాయని భారతీయ అమెరికన్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని వార్తలు