జూలై 4 కల్లా 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కొత్త లక్ష్యం నిర్దేశించుకున్నారు. జూలై 4 కల్లా 70 శాతం అమెరికన్లకు (18 ఏళ్లు పైబడినవారు) వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల వ్యాక్సినేషన్ వేగం మందగించింది. కొన్ని రాష్ట్రాల్లో సగానికి పైగా వ్యాక్సిన్ డోసులు మిగిలిపోతున్నాయి.
వ్యాక్సిన్ అవసరం లేదని యువత భావిస్తుండటంతో ఈ ధోరణి కనిపిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త ప్రచారాస్త్రాలను ఎంపిక చేసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు బైడెన్ సూచించారు. కరోనా బారినపడే అవకాశం లేకపోయినా, తమ ద్వారా ఇంట్లో వారికి సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలంటూ యువతకు సూచించాలని కోరారు. డిమాండ్ తక్కువగా ఉన్న చోట్ల నుంచి వ్యాక్సినేషన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న చోట్లకు టీకాలను పంపాలని సూచించారు.
18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేయాలన్నది బైడన్ తన లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ఆగడం కంటే, సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేయడమే మార్గమన్నారు. వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేందుకు కోట్లాది డాలర్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది.