‘నిష్క్రమణ’ నిర్ణయం సహేతుకమే

24 Aug, 2021 04:46 IST|Sakshi

అఫ్గాన్‌ నుంచి అమెరికా సేనలు వెనుదిరగడంపై బైడెన్‌

వాషింగ్టన్‌: అఫ్గాన్‌ను తమ సేనలు అర్ధంతరంగా వదిలివెళ్లడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించుకున్నారు. యుద్ధక్షేత్రంగా మారిన అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం నిష్క్రమణ ఘట్టం.. చరిత్రలో సహేతుక రీతిలోనే పదిలమై ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టు 31వ తేదీలోపు అమెరికా సైన్యం స్వదేశానికి వస్తుందని బైడెన్‌ గతంలో ప్రకటించగా అంతకు రెండు వారాల ముందే తాలిబన్లు తెగబడి అఫ్గాన్‌ మొత్తాన్నీ ఆక్రమించారు. రణరంగంలో అఫ్గాన్‌ ప్రభుత్వ బలగాలకు తోడుగా నిలవడకుండా సొంత దేశానికి సైన్యాన్ని వెనక్కి పంపడంతో ఎయిర్‌పోర్టు వద్ద వందలాది మంది అఫ్గాన్ల అనూహ్యస్థాయిలో వలసలతో తోపులాటలు, కాల్పులు జరిగాయి.

దీంతో విపక్ష రిపబ్లికన్‌ పార్టీసహా పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో బైడెన్‌ మరోసారి స్పందించారు. ఆదివారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘మా నిర్ణయం న్యాయబద్ధమైన, సహేతుకమైన నిర్ణయంగానే చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తున్నా. ఇక మీదటైనా తాలిబన్లు ప్రజామోద నిర్ణయాలు తీసుకోవాలి. దేశాన్ని ఆర్థికంగా, వాణిజ్యపరంగా నిలబెట్టాలి. తమ ధర్మమే అఫ్గాన్‌లో కొనసాగాలని తాలిబన్లు కోరుకుంటున్నారు. తమ పాలననూ అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందని నమ్ముతున్నారు. అమెరికా లాంటి దేశాల దౌత్యసాయం వారికి అక్కర్లేదట. తాలిబన్లు.. సరైన ప్రణాళికలేని సాయుధమూకల గుంపు’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు