అసలు చూస్తున్నది కిమ్‌నేనా? 20 కిలోలు తగ్గిండు.. మనిషి మారిండు

10 Sep, 2021 17:11 IST|Sakshi

స్టైల్‌ మార్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌

సైనిక పరేడ్‌లో ఉత్సాహంగా.. నవ్వుతూ కనిపించిన అధినేత

పోంగ్యాంగ్‌: నవశకం నియంతగా పేరు పొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ మళ్లీ బహిరంగ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. చాలా రోజుల తర్వాత కనిపించిన కిమ్‌ శరీరాకృతి మారింది. ఇంతకుముందు బొద్దుగా కనిపించే కిమ్‌ ఈసారి చాలా సన్నబడి కనిపించాడు. ఒక్కసారిగా అతడి మార్పు చర్చనీయాంశమైంది. చివరిసారి కనిపించినప్పుడు అతడి తలపై ఉన్న ఒక  గుర్తు గురించి సర్వత్రా చర్చ జరగ్గా ఇప్పుడు కిమ్‌ బక్కగా అవ్వడం ఆసక్తికరంగా మారింది.

73వ మిలిటరీ పరేడ్‌ సందర్భంగా ప్యాంగ్యాంగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కిమ్‌ కపించాడు. గతానికి కన్నా భిన్నంగా చలాకీగా.. హుషారుగా.. నవ్వుతూ కనిపించాడు. ఈ సందర్భంగా అతడి లుక్స్‌ వైరల్‌గా మారాయి. ఆయన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సుంగ్‌ మాదిరి హెయిర్‌ స్టైల్‌లో కనిపించాడు. కొన్ని నెలలుగా ఆయన సన్నబడడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బరువు తగ్గేలా కసరత్తులు చేశారు. సన్నబడిన అనంతరం కనిపించడం ఇదే తొలిసారి. సైనిక పరేడ్‌లో ఎప్పుడూ లేని విధంగా కిమ్‌ కనిపించాడు. ఇద్దరు పిల్లలతో కలిసి దరహాసం చేస్తూ ముందుకు కదిలాడు. ఎంతో ఉత్సాహంగా సైనికుల పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా సైనికులకు అభివాదం చేస్తూ ముందుకుసాగాడు.

కిమ్‌ ఆరోగ్యంపై అంతర్జాతీయంగా ఎప్పుడూ చర్చ సాగుతోంది. 2018లో ఓ టీవీ ఫుటేజ్‌లో కిమ్‌ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వచ్చాయి. అందుకే అతడి సోదరి ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోందని చర్చ నడిచింది. అలా చర్చ జరుగుతున్నప్పుడే కిమ్‌ అలా మళ్లీ మీడియా ముందుకు ప్రత్యక్షమవుతుంటాడు. కిమ్‌ ఒకప్పుడు 140 కిలోల బరువు ఉండేవాడు. అనంతరం కొన్నిరోజులు బరువు తగ్గాడు. అదే కొనసాగిస్తూ ఇప్పుడు 100కు చేరువయ్యాడని తెలుస్తోంది. తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. కిమ్‌ చికిత్స పొందుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ సమయంలో అతడి సోదరి వ్యవహారాలు చూసుకుంటోంది. తాజాగా కిమ్‌ 20 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు