ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగీకరించారు.
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రజలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగీకరించారు. అయిదేళ్లకి ఒకసారి జరిగే అధికార వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సదస్సుని బుధవారం ఆయన ప్రారంభించారు. గత అయిదేళ్లలో తాము నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యామని, దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని కిమ్ పేర్కొన్నట్టుగా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గత తొమ్మిదేళ్ల పాలనలో కిమ్ గతంలో ఎన్నడూ లేనంతగా కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కరోనాతో సరిహద్దుల మూసివేత, దేశ ఆర్థిక రంగం కుదేలైపోవడం, అమెరికా విధించిన ఆంక్షలు, వరసగా కమ్మేసిన ప్రకృతి వైపరీత్యాలు వంటివన్నీ దేశాన్ని అతలాకుతలం చేశాయి.