భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా

11 Oct, 2020 04:05 IST|Sakshi
ఉత్తర కొరియా మిలటరీ పరేడ్‌లో పాల్గొన్న ఆర్మీ ట్యాంక్‌లు, వేలాదిమంది సైనికులు

సియోల్‌: ఉత్తర కొరియా అతి భారీ నూతన ఖండాంతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ని ప్రదర్శించింది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద మిస్సైల్‌ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనిని మిలిటరీ పరేడ్‌లో ప్రదర్శించారు. ఉత్తర కొరియాలో అధికార వర్కర్స్‌ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరేడ్‌ నిర్వహించారు. వేలాది మంది సైనికులు, మాస్క్‌లు ధరించకుండా ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ ఖండాంతర క్షిపణిని ప్రధాన వీధుల్లో భారీ వాహనంపై ప్రదర్శించగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ దీనిని వీక్షించినట్టు ఆ దేశ అధికారిక టీవీ చానల్‌ కేసీ టీవీలో చూపించారు.

రోడ్లపై ప్రదర్శించిన ప్రపంచంలో అతిపెద్ద మిస్సైల్‌ ఇదని, ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌కి చెందిన అంకిత్‌ పాండా ట్వీట్‌ చేశారు. ఈ క్షిపణి అమెరికాలోని రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోగల శక్తిసామర్థ్యాలు కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ మిస్సైల్‌ని, అమెరికా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టేటపుడు పరీక్షించాలని భావిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఆత్మరక్షణ కోసం మన సైన్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని భారీ జనసమీకరణను ఉద్దేశించి కిమ్‌ వ్యాఖ్యానించారు.

 

మరిన్ని వార్తలు