పనిచేయకుండానే 15 ఏళ్లుగా జీతం తీసుకుంటున్న ఉద్యోగి

22 Apr, 2021 20:41 IST|Sakshi

మీరు ఎప్పుడైనా ఏ కారణం లేకుండా జాబ్ చేయకపోతే మీ కంపెనీ శాలరీ ఇచ్చిందా?. ఒకవేల ఇచ్చిన మహా అయితే 15 రోజులో, నెల రోజులో ఇస్తుంది. కానీ కొన్ని ఏళ్ల పాటు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా?. అసలు ఎప్పుడైనా అలా తీసుకుంటున్న గురుంచి విన్నారా?, నాకు తెలిసి ఉండదు. కానీ, ఒక వ్యక్తి మాత్రం జాబ్ చేయకుండా 15 ఏళ్ల పాటు ప్రతి నెల కచ్చితంగా జీతం తీసుకుంటున్నాడు. ఇలాంటి ఘటన ఇటలీలో జరిగింది. 

ఇటలీలో ఒక ప్రభుత్వ ఉద్యోగి 2005 నుంచి తాను పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్ళడం మానేశాడు. కానీ, జీతం మాత్రం ప్రతి నెల తీసుకుంటున్నాడు. ఈ వ్యక్తి పేరు సాల్వేటోర్ సుమాస్. ఇతను కాటాన్జారో నగరంలో ఉన్న పుగ్లీసీ సియాసియో ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అయితే, ఈ పదిహేనేళ్ళు ఉద్యోగం చేయకపోయిన అతనికి అందిన జీతం అక్షరాలా 5,38,000 యూరోలు. ప్రస్తుతం ఈయన వయస్సు 67 ఏళ్లు. ఇప్పుడు ఆ విషయం బయటపడటంతో పోలీసులు ఇతన్ని విచారిస్తున్నారు. 

అతనితో పాటు ఆసుపత్రికి చెందిన ఆరుగురు మేనేజర్లను కూడా ఈ కేసులో బుక్ చేశారు పోలీసులు. సుమాస్ డ్యూటీకి రాకపోయినా హాజరు ఎలా వేశారో అనే విషయంపై వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. పోలీసులు హాజరు, జీతం రికార్డులతో పాటు సహోద్యోగుల నుంచి కొంత సమాచారం సేకరించారు. ఆ సమాచారం ప్రకారం.. 2005లో ఆ ఆసుపత్రి డైరెక్టర్ ను తనపై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేయవద్దని బెదిరించాడు. ఆ గొడవ కారణంగా అతను ఆసుపత్రికి రావడం మానేశాడు. ఆ తర్వాత డైరెక్టర్ కూడా పదవీ విరమణ చేశారు. 

ఆ తర్వాత వచ్చిన డైరెక్టర్ లేదా మానవ వనరుల విభాగం(హెచ్ఆర్ డిపార్ట్మెంట్) కూడా ఎప్పుడూ సాల్వేటోర్ సుమాస్ హాజరును పట్టించుకోలేదు అని పోలీసులు చెప్పారు. 2016లో ఇటలీ ప్రధాని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కొన్ని కఠినతర చట్టాలను తీసుకొచ్చారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వివరాలనూ పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న అన్ని మోసాలను బయటకు తీయాలని పేర్కొన్నారు. దీంతో జరిపిన విచారణలో ఈ విషయం బయటకు వచ్చింది.
 

మరిన్ని వార్తలు