కిస్కా కథ అలా ముగిసింది..!

27 Mar, 2023 05:18 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా పేరు

శాంక్చువరీలోనే 40 ఏళ్లు ఖైదు..

ఇటీవలే తుదిశ్వాస

ఒంటారియో: కిస్కా. ఓర్కా రకం కిల్లర్‌ వేల్‌. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం. దాదాపు 40 ఏళ్లపాటు నీళ్ల ట్యాంకులో ఒంటరిగా బతుకీడ్చింది. చోటు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. ఐస్‌ల్యాండ్‌ సమీపంలోని సముద్ర జలాల్లో ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఈ కిల్లర్‌ వేల్‌ పట్టుబడింది. దీనిని ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద ఉన్న మెరైన్‌ల్యాండ్‌ జూ పార్క్‌కు అమ్మేశారు.

40 ఏళ్ల పాటు కిస్కా ఓ నీళ్ల ట్యాంకుకే పరిమితమైపోయింది.ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా ముద్రపడింది. ఇటీవలే సుమారు 47 ఏళ్ల వయస్సులో కిస్కా చనిపోయింది. ‘కిస్కా మృతి పట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్‌ శాంక్చువరీ ప్రాజెక్టు ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’అని ఏనిమల్‌ జస్టిస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కెమిల్లె లబ్చుక్‌ అన్నారు. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కాల ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు.

మరిన్ని వార్తలు