Prophet Comment Row: నూపుర్‌ కామెంట్లతో ముదురుతున్న వివాదం.. ‘భారత ఉత్పత్తులు మాకొద్దు!’

6 Jun, 2022 18:27 IST|Sakshi

Kuwaiti supermarket pulled: మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల దుమారం వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అక్కడికి సదరు ప్రతినిధిపై బీజేపీ వేటు వేసింది కూడా. తన వ్యాఖ్యల పట్ల నూపుర్‌ క్షమాపణలు చెప్పింది కూడా. అయినప్పటికీ గల్ఫ్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ మేరకు కువైట్‌లోని అల్ అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ సూపర్‌ మార్కెట్‌ భారతీయ ఉత్పత్తులను పక్కనపెట్టింది. నూపుర్‌ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ ఉత్పత్తులను వాడేది లేదంటూ ఒక ట్రాలిలో ప్యాక్‌ చేసి పక్కనే పెట్టేశారు. సదరు స్టోర్‌ సీఈవో ‘ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించం అందుకే భారతీయ ఉత్పత్తులను తొలగిస్తున్నాం’ అని తేల్చి చెప్పేశారు.

అంతేకాదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ బీజేపి అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా తీవ్రంగా మండిపడుతోంది. భారత విదేశీ కార్మికులకు గల్ఫ్ దేశాలు ప్రధాన గమ్యస్థానంగా ఉన్నాయి. భారత్‌ నుంచి విదేశాల్లో పని చేస్తున్న మొత్తం 13.5 మిలియన్ల మందిలో..  8.7 మిలియన్ల మంది గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నారనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్క.

ఇక భారత్‌ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కువైట్ సుమారు 95 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అదీగాక భారత్‌ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా గోధుమల ఎగుమతులను నిషేధించిన సమయంలో కూడా కువైట్‌ నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వమని కోరడం గమనార్హం.

(చదవండి: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్‌ శర్మ)

మరిన్ని వార్తలు