ఘోర రోడ్డు ప్రమాదం : 15 మంది దుర్మరణం

3 Mar, 2021 11:14 IST|Sakshi

అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద రోడ్డు ప్రమాదం

ఎస్‌యూవీని ఢీకొట్టిన ట్రక్‌, 15 మంది దుర్మరణం 

వాషింగ్టన్‌: అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దక్షిణ కాలిఫోర్నియా- మెక్సికో సరిహద్దులోని స్టేట్‌ రూట్‌ 115, ఇంపీరియల్‌ కౌంటీలోని నోరిష్‌ రోడ్‌లో యూఎస్‌వీ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే కన్నుమూయగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు ఎల్ సెంట్రో రీజినల్ మెడికల్ సెంటర్ అత్యవసర విభాగం డైరెక్టర్ జూడీ క్రజ్ తెలిపారు. 

ఎస్‌యూవీని ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో అందులో చిక్కుకున్న వారిని, మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.  బాధితులంతా 15 నుంచి 53 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు ఉన్నారని,డ్రైవర్‌ కూడా తీవ్ర గాయాలపాలైనట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది. కెపాసిటీకి మించి తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైందనీ, దాదాపు సుమారు 27 మంది వరకు ఉన్నట్లు స్తానిక బోర్డర్ డివిజన్ చీఫ్ ఆర్టురో ప్లేటెరో పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మెక్సికన్‌ పౌరులు ఉన్నారని, ఇతరుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. 

మరిన్ని వార్తలు