కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!

11 May, 2021 10:14 IST|Sakshi

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరో​నా కేసులు పెరుగుతున్నాయి. అయితే పలు దేశాలు టీకాలు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్‌తో 80 శాతం మరణాలు తగ్గే అవకాశం ఉందని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాడ్‌ పేర్కొంది. అంతే కాకుండా ఫైజర్‌ బయోటెక్‌ ఫస్ట్‌ డోస్‌తో 80శాతం, రెండో డోస్‌తో 97శాతం కోవిడ్‌ మరణాలు తగ్గుతాయని వెల్లడించింది. ఏప్రిల్‌ నెలలో కరోనా సోకి 28 రోజుల అనంతరం మృతి చెందిన బాధితులపై బ్రిటన్‌లో రియల్‌ వరల్డ్‌ సెట్టింగ్‌ సంస్థ అధ్యయనం చేపట్టింది.

ఈ అధ్యయనం ప్రకారం.. ఎటువంటి టీకా తీసుకోని వారితో పోల్చితే ఒక డోసు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 55 శాతం, ఒక డోసు ఫైజర్‌ ‍టీకా తీసుకున్న వారిలో 44 శాతం మంది మరణించకుండా సురక్షితంగా కోవిడ్‌ నుంచి బయటపడినట్లు తెలిపింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల 80 శాతం మరణాలు తగ్గుతాయని కూడా పేర్కొంది. అదేవిధంగా ఫైజర్‌-బయోటెక్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకోవడం వల్ల 69శాతం మరణాలు తగ్గడంతో పాటు 97 శాతం సురక్షితమని ఈ అధ్యయనం వివరించింది.

ఫైజర్‌-బయోటెక్‌ రెండు డోస్‌లు తీసుకున్న 80సంవత్సరాల వయసు వారిలో 93శాతం ఆస్పత్రిలో చేరే అవసరం ఉండదని తెలిపింది. ఇక ఇంగ్లండ్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత సడలించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు వేగంగా అందిస్తే కోవిడ్‌ నియంత్రణ మెరుగవుతుందని రియల్‌ వరల్డ్‌ సెట్టింగ్‌ అధ్యయన సంస్థ అభిప్రాయపడింది.

(చదవండి: కోవిడ్‌ సంక్షోభం: భారత్‌కు మద్దతుగా ట్విటర్‌ భారీ విరాళం)

మరిన్ని వార్తలు