భారత్‌ను చూడండి.. ఎంతమంది ప్రతిభావంతులు ఉన్నారో: పుతిన్‌ ప్రశంసలు

5 Nov, 2022 13:44 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా భారతీయులపై ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌తీయులు ప్ర‌తిభావంతులని అన్నారు. భారతీయుల్లో అపార నైపుణ్య శక్తి ఉందని, అందులో ఏ అనుమానం లేదని అన్నారు. వీరు అభివృద్ధి పరంగా అత్యుత్తమ ఫలితాలను సాధించగల సమర్ధులని వ్యాఖ్యానించారు. నవంబర్‌ 4న  రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌పై పొగడ్తల జల్లు కురిపించారు.

‘ఒకసారి భారత్‌ను చూడండి. దేశ అభివృద్ధి కోసం పాటుపాడే ఎంతో మంది ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. అభివృద్ధి విషయంలో భారత్‌ కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ దేశంలో దాదాపు 150 కోట్ల మందితో భారత్‌ ఇప్పుడు సమర్థవంతమైన దేశంగా ఉంది’ అంటూ కొనియాడారు. ఇండియాలాగే రష్యాకు విశిష్ట నాగరికత, సంస్కృతి ఉందని తెలిపారు. అయితే దేశంలో యూరోపియన్‌ సంస్కృతి కూడా ముడిపడి ఉందని తెలిపారు. 
చదవండి: ఉభయ కొరియాల మధ్య...ఉద్రిక్తతలు మరింత తీవ్రం

కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌పై ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవలి కాలంలో వరుసగా ప్రశంసలు కురిపిస్తున్నారు. వారం రోజుల క్రితం ప్రధాని మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మోదీ నిజమైన దేశభక్తుడని, ఆయన సారథ్యంలో భారత్‌ చాలా పురోగతి సాధించిందని కొనియాడారు. 
చదవండి: ట్విటర్‌ డీల్‌: మస్క్‌పై ధ్వజమెత్తిన అమెరికా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు