ట్రస్ కేబినెట్‌లో కీలక పదవులు వాళ్లకే.. రిషి సునాక్ టీంకు మొండిచేయి..

7 Sep, 2022 19:47 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బుధవారం తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి విభిన్నమైన కేబినెట్‌ను ప్రకటించిన తర్వాత ఈ భేటీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కీలక శాఖల బాధ్యతలను మైనార్టీ వర్గాలకే కేటాయించారు ట్రస్‌. దీంతో తొలిసారి శ్వేత జాతీయులు కీలక హోదాలో లేకుండా బ్రిటన్ కేబినెట్‌ ఏర్పాటు జరిగింది.

రిషి సునాక్‌ టీంకు నో ఛాన్స్
అందరూ ఊహించినట్లుగానే ట్రస్ కేబినెట్‌లో భారత సంతతికి చెందిన, ప్రధాని పదవికి పోటీ పడిన రిషి సునాక్‌కు చోటు దక్కలేదు. ట్రస్ మంత్రివర్గంలో ఉండబోనని రిషి ముందుగానే చెప్పారు. అందుకు తగినట్లుగానే ట్రస్ ఆయనకు మొండిచేయి చూపారు. అంతేకాదు రిషికి మద్దతుగా నిలిచిన మాజీ మంత్రుల్లో ఏ ఒక్కరిని ట్రస్ తన కేబినెట్‌లోకి తీసుకోలేదు. దీంతో వారంతా ఏ పదవీ లేకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

ట్రస్ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన సుయెళ్లా బ్రవర్మన్‌కు హోంమంత్రిగా అవకాశం దక్కింది.  ఆగ్రాలో పుట్టిన మరో భారత సంతతి వ్యక్తి అలోక్ శర్మకు కూడా చోటు లభించింది. భారత్, శ్రీలంక మూలాలున్న రణిల్ జయవర్దనాకు పర్యావరణ మంత్రిగా స్థానం దక్కింది.
చదవండి: దేశ అధ్యక్షుడి ప్రసంగం.. అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు..

మరిన్ని వార్తలు