ఆఫీసులకు రండి.. మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్‌!

8 Sep, 2021 13:35 IST|Sakshi

లండన్‌: కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనశైలి మారిందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకునే వెసలుబాటును కల్పించాయి. వీటిలో ప్రధానంగా సేవా రంగం, ఐటీ సెక్టార్‌లోని ఉద్యోగులే అధికమని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా సెకండ్ వేవ్ నుంచి ప్రపంచం కోలుకుంటోంది.

దీంతో ప‌లు కంపెనీలు తిరిగి తమ ఉద్యోగుల‌ను కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. అయితే ఉద్యోగులు మాత్రం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే మొగ్గు చూపుతున్నారట. దీంతో చేసేదేమిలేక పలు కంపెనీలు ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్లంటూ వారిని అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

రండి బాబు రండి.. బోలెడు ఆఫర్లు
ఇటీవల యూకేలో కూడా క‌రోనా స‌ద్దుమ‌ణిగింది. కేసులు కూడా పెద్దగా లేవు. దీంతో ఆఫీసుల‌కు రావాలంటూ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, బ్యాంకులు, ఇత‌ర ప్రైవేటు కంపెనీలు.. త‌మ ఉద్యోగుల‌ను కోరుతున్నాయి. కాకపోతే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రమే రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అక్కడ చాలా మంది ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయ‌డానికే ఇంకా ఆస‌క్తి చూపిస్తూ ఆఫీసుల‌కు వెళ్ల‌డానికి మొండికేస్తున్నారట.

దీంతో లండ‌న్‌లోని పలు కంపెనీలు ఉద్యోగుల‌పై వరాలు జల్లు కురిపిస్తున్నాయి. ఆఫీసుకు వ‌చ్చి ప‌ని చేస్తే బోలెడు బెనిఫిట్స్ ఉంటాయ‌ని ఆకర్షిస్తున్నాయి. ఇప్ప‌టికే లండ‌న్‌ ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్న‌ప్ప‌టికీ.. ఉద్యోగులు మాత్రం ఆఫీసు అనేస‌రికి బద్దకిస్తున్నారట.  మరికొన్ని సంస్థ‌లు ఉచితంగా లంచ్, బార్బిక్ ఉంటుందని ప్రకటిస్తున్నాయి. ఓ కంపెనీ అయితే ఏకంగా బ‌రిస్టానే ఆఫీసులో పెట్టేసింది. ఇలా ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలని అక్కడి కంపెనీలు పడరాని పాట్లు పడుతున్నాయట.

చదవండి: Man Swallowed Phone: ఫోన్ మింగిన ఘనుడు.. కడుపులోకి వెళ్లగానే..

మరిన్ని వార్తలు