కౌలాలంపూర్: మలేసియా ప్రధాని మొహియుద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. పార్లమెంట్ దిగువసభలో మెజారిటీ కోల్పోవడంతో అధికారంలోకి వచ్చిన 18 నెలలకే వైదొలగాల్సి వచ్చింది. మలేసియాకు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించిన యాసిన్ సోమవారం రాజు సుల్తాన్ అబ్దుల్లాకు రాజీనామా సమర్పించారు.
సంకీర్ణంలోని విభేదాల కారణంగా మద్దతు కోల్పోయి వైదొలిగిన యాసిన్... మరో ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉపప్రధాని ఇస్మాయిల్, మాజీ మంత్రి, యువరాజు రజాలీ హమ్జా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయిన మహతిర్ వైదొలగడంతో యాసిన్ 2020లో అధికార పగ్గాలు చేపట్టారు.